దర్యాప్తు సంస్థలు పంజాజ్ నేషనల్ బ్యాంకు (పిఎన్బి)లో స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీలను స్వదేశానికి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనంటూ కుంటిసాకులు చెబుతూ వస్తున్న చోక్సీకి షాకిచ్చేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి కీలక నిర్ణయం తీసుకుంది. విచారణను ఆలస్యం చేసే ఉద్దేశంతో కావాలనే సాకులు చెబుతున్నాడని, చోక్సీకి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్, రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాలని ఇడి ముంబై కోర్టును కోరింది. దర్యాప్తులకు సహరించకుండా, భారతదేశానికి తిరిగి రావడానికి నిరాకరిస్తున్నాడని సిబిఐ, ఇడి ఆరోపించాయి. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న చోక్సీ అభ్యర్థనను కొట్టివేయాలని పేర్కొంది.
పిఎన్బి కుంభకోణం విచారణను ఆంటిగ్వాలో జరపాలంటూ మెహుల్ చోక్సీ పెట్టుకున్న విజ్ఞప్తిని ఇడి తిరస్కరించింది. అలాగే ఆంటిగ్వా నుంచి చోక్సీని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి వైద్య నిపుణులతో ఎయిర్ అంబులెన్స్ను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశంలో అవసరమైన అన్ని వైద్య చికిత్సలను అందుబాటులో ఉంచుతామని కూడా ఇడి కోర్టుకు తెలియచేసింది. ఈ మేరకు ముంబై కోర్టులో కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేసింది. అనారోగ్య కారణం పేరుతో చట్టపరమైన చర్యలను ఆలస్యం చేస్తూ, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడని చోక్సీపై ఇడి మండిపడింది. భారతదేశం తిరిగి వచ్చేలా అఫిడవిట్ దాఖలు చేయాలని చోక్సీని ఆదేశించాలని కోర్టును కోరింది. అతను తిరిగి రావడానికి ఖచ్చితమైన తేదీని పేర్కొనాలని ఇడి కోరింది. ఆర్డర్ ఇచ్చిన తేదీ నుంచి ఒక నెలలోపు రావాలని పేర్కొంది. కాగా నకిలీ పత్రాలతో పిఎన్బి 14వేల కోట్లరూపాయల మేర రుణాలను తీసుకొని ఎగ్టొట్టి నీరవ్మోడీ లండన్కు పారిపోగా, మెహుల్ చోక్సీ ఆంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వం తీసుకున్న సంగతి తెలిసిందే.