ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. చైనా విదేశాంగ శాఖ కశ్మీర్పై చేసిన ప్రకటన అంతకుముందు కంటే పూర్తి భిన్నంగా ఉంది. ‘యూఎన్ చార్టర్, దాని ప్రతిపాదనల ప్రకారం కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకాలని’ చైనా ఇటీవల చెప్పింది. కానీ, ఇప్పుడు మాత్రం ‘భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి’ అంటోంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్యాంగ్ షువాంగ్, ‘కశ్మీర్ అంశంపై చైనా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. మా వైఖరి పూర్తిగా స్పష్టంగా ఉంది. భారత్-పాకిస్తాన్కు మేం చెప్పేది ఒక్కటే. కశ్మీర్తో పాటు మిగతా వివాదాలను కూడా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. దానివల్ల రెండు దేశాల మధ్య పరస్పరం నమ్మకం పెరుగుతుంది. ఆ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. దానివల్ల భారత్, పాక్ సమస్యలు పరిష్కారం అవుతాయి’ అన్నారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అక్టోబర్ 11, 12 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు. గతంలో, ఆర్టికల్ 370ని తొలగించిన భారత్ జమ్ము-కశ్మీర్ యధాతథ స్థితిని మార్చేస్తోందని చైనా నీతి వాఖ్యాలు వెలగబోసింది . పాకిస్తాన్ ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వరకూ తీసుకెళ్లింది. అక్కడ దానికి చైనా మద్దతు కూడా లభించింది. అంతేకాదు, కొన్ని రోజుల కిందట పాకిస్తాన్లోని చైనా రాయబారి యావో జింగ్ ‘కశ్మీర్ అంశంలో చైనా పాకిస్తాన్కు అండగా ఉంటుందని’ అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కశ్మీర్ అంశాన్ని భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ చెబుతోంది. పాకిస్తాన్ను చైనాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా గెంగ్ షువాంగ్ చెప్పారు. రెండు దేశాల నేతల మధ్య సన్నిహిత చర్చల సంప్రదాయం ఉందన్నారు.