విమానయాన కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 23న హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొంది. యూపీఏ హయాంలో విమానయాన కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ను ఈడీ ఇప్పటికే విచారించింది. బోయింగ్, ఎయిర్బస్ల నుంచి రూ 70,000 కోట్లకు విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ గత వారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు నష్టం వాటిల్లేలా చర్యలు చేపట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ స్కామ్ జరిగిన సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా, ప్రఫుల్ పటేల్ పౌరవిమానయాన మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ ఎదుట చిదంబరం హాజరుకానుండటం గమనార్హం.