సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని చీరాల అసెంబ్లీ స్థానానికి కరణం బలరాం పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేడంతో ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు టీడీపీ అధిష్టానం ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అయినపట్టికీ అభ్యర్థి ఎంపిక కొలిక్కి రాలేదు. ఆమంచి పార్టీని వీడడం, మరికొందరు నేతలు సీటును ఆశిస్తుండడంతో చంద్రబాబు కూడా అభ్యర్థి ఎంపికపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
ఆమంచి పార్టీని వీడటంతో కరణం తదితరులను నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ నియోజకవర్గంలో పోటీకి దిగాలని కరణం భావించారు. పార్టీ ఆదేశిస్తే తాను చీరలలో పోటీకి సిద్ధమంటూ కరణం చేసిన ప్రకటన కూడా ఇందులో భాగమే. నిజానికి కరణం సొంత నియోజకవర్గం అద్దంకి. రాజకీయ ప్రత్యర్ధి, వైసిపి తరపున పోయిన ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించటంతో కరణంకు నియోజకవర్గం లేకుండా పోయింది.
తనకు టికెట్ ఇవ్వరని తెలిసినా కరణం అద్దంకి మీదే దృష్ణి పెట్టారు. దాంతో రెండు వర్గాల మధ్య తీవ్రమైన వివాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఎంఎల్సీ ఇచ్చినా కరణంకు సంతృప్తి కలగలేదు. నియోజకవర్గంలో ఇద్దరు పోటాపోటీగా రాజకీయాలు నడుపుతునే ఉన్నారు. దాంతో ఎప్పుడూ నియోజకవర్గంలో గొడవలు జరుగుతుందేవి. ఈ సమయంలోనే ఆమంచి పార్టీ వదిలిపోవటంతో వెంటనే చంద్రబాబు కరణాన్ని చీరాల ఇన్చార్జిగా నియమించారు.
గొట్టిపాటి, కరణం మధ్య వైరం పోవాలంటే కరణాన్ని చీరాలలో అభ్యర్ధిగా ప్రకటించటమొకటే మార్గమని చంద్రబాబు భావిస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ నాయకులు కరణం బలరాం పేరును సూచించినట్లు తెలుస్తుండగా సీఎం చంద్రబాబు కూడా బలరాం వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. శనివారం చంద్రబాబు నేతలతో సమీక్ష నిర్వహించి కరణం బలరాంను చీరాల అసెంబ్లీ అభ్యర్తిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.