ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకీ ప్రాధాన్యత నెలకొంది. ఉదయం తొలుత మంత్రి శిద్దా రాఘవరావుతో ఎమ్మెల్యే ఆమంచి భేటీ అయ్యారు. అనంతరం మంత్రితో కలిసి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆమంచి కృష్ణమోహన్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.
స్థానికంగా పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. బుధవారం జగన్తో భేటీని ఆమంచి వాయిదా వేసుకొన్నారు. మంగళవారం చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లిలో తన అనుచరులతో ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆమంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆమంచి చంద్రబాబు ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.