నేటి నుండి జన్మభూమి సందర్భంగా, నాయకులందరూ గ్రామాలలోని ఉండాలని, పదిరోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి వారి దగ్గరకు స్వయంగా నాయకులే వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, తక్షణ పరిష్కారానికి పూనుకోవాలని సూచించారు. ఇది ఎన్నికల సంవత్సరమని, ప్రతి తెలుగుదేశం నేత, కార్యకర్త, వచ్చే నాలుగైదు నెలలూ విజయం కోసం బాగా శ్రమించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రారంభమైన ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సూచించారు. ఈ పది రోజులూ నాయకులు గ్రామాలు, వార్డుల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలని అన్నారు.
ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమని, భావితరాల భవిష్యత్తు ఈ ఎన్నికలపైనే ఆధారపడివుందని పేర్కొన్న చంద్రబాబు, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తేనే, రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చని, ఈ విషయాన్ని ప్రజలకు సవివరంగా తెలియజేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు. టీడీపీ గెలవకుంటే రాష్ట్రం చాలా కష్టాల్లోకి నెట్టివేయబడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికలలో కనీసం 25 ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని చంద్రబాబు నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.