రాష్ట్ర ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో పాదయాత్ర చేపట్టినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసిందని, మోదీ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్షతప్పదని చంద్రబాబు హెచ్చరించారు. మోదీ ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా కేంద్రం స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. విభజన హామీలు సాధించేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వైసీపీ, బీజేపీతో కలిసిపనిచేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కేసుల మాఫీ కోసం మోదీకి ఊడిగం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కోసమే తాము పోరాడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.