టీడీపీ కార్యకర్తల రక్షణ కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అనంతపురం, గురజాల, ప్రకాశం, నరసరావుపేట, వినుకొండల్లో పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని తెలిపారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో తన కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలు గొంతుక వినిపించాలని చంద్రబాబు చెప్పారు. టీడీపీపై బురద చల్లడమే వైసీపీ సూత్రమని విమర్శించారు. టీడీపీ హయాంలో అమలుచేసిన రైతు రుణమాఫీ 4, 5 విడతలను చెల్లించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానిదేనని అన్నారు. వైయస్ చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేశామని అన్నారు. మిగిలిన ప్రాజెక్టులు చివరిదశ లో ఉన్నాయని చెప్పారు. అలాంటి ప్రాజెక్టులను ఇప్పుడు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు.