టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆమె మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. సినీ సెలబ్రిటీలు గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 500 చిత్రాలకి పైగా నటించారు. సీనియర్ నటి గీతాంజలి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపాన్ని తెలియజేశారు. “ఎన్టీఆర్ దర్శకత్వంలో `సీతారామ కళ్యాణం` చిత్రంలో సీతగా నటించి ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుని, ఆ తర్వాత హాస్యనటిగా రాణించిన నటీమణి గీతాంజలిగారి మరణం విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
previous post