టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రజావేదిక కూల్చివేతపై, టీడీపీ శ్రేణులపై జరిగిన దాడుల నేపథ్యంలో చంద్రబాబుతో టీడీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులను ఆయన ఖండించారు.
ప్రకాశం జిల్లాలో దాడిని, నర్సరావుపేట దళిత వైద్యులపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. నెల వ్యవధిలోనే 130కి పైగా దాడులకు వైసీపీ తెగబడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజావేదికను కూల్చివేయాలనుకోవడం సరైన ఆలోచన కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.