కుప్పంలో నేడు ఏపీసీఎం చంద్రబాబు విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. కుప్పంలో ఇప్పటికే చెప్పిన అభివృద్ధి అంతా చేశామని, అయితే రైతులపై ఇంకా ద్రుష్టి పెట్టాల్సి ఉందని ఆయన అన్నారు. కుప్పం ప్రాంతాన్ని ఉద్యానవన పంటలకు హబ్ గా మారుస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం కోసం తాను ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చానని వెల్లడించారు. దీనివల్ల రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పద్ధతిలో తక్కువ ఎరువు, నీటితో మంచి దిగుబడి వస్తోందన్నారు. అలాగే ప్రకృతి సేద్యాన్ని కూడా ఏపీ పాటిస్తోందని అన్నారు. వ్యవసాయంతో పాటు గొర్రెలు, కోళ్లతో పాటు డెయిరీపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.
మంచిపని చేస్తే గుర్తుంచుకునే వారు ఇక్కడి ప్రజలు అంటూ కుప్పం ప్రజలను గురించి బాబు అన్నారు. ఇక్కడి వారు చాలా మంచివారనీ, నీతి-నిజాయితీగా ఉంటారనీ ఆయన వ్యాఖ్యానించారు. నాగరికతకు మారుపేరు విమానాశ్రయమని అన్నారు. కుప్పంతో పాటు త్వరలోనే నెల్లూరు, కర్నూలులో ఎయిర్ పోర్టు రాబోతోందని తెలిపారు. కుప్పం ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తోందనీ, అయితే తనకు గుంటూరులో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం ఉందని వెల్లడించారు. త్వరలోనే కుప్పం ఇండస్ట్రియల్ హబ్ గా మర్చి చూపిస్తానని ఆయన అన్నారు. ఇక్కడి యువత వలసపోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఇక్కడి యువతే కాకుండా బయటి ప్రాంతాలకు చెందిన యువతీయువకులు సైతం ఇక్కడకు వచ్చి పనిచేసుకునేలా కుప్పం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు.
Live from Laying Foundation Stone of Kuppam Airport, Kuppam, @chittoorgoap https://t.co/73vzlNfJXZ
— N Chandrababu Naidu (@ncbn) January 3, 2019