టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన దీక్షితులును తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీటీడీని వైఎస్ జగన్ సర్కారు ఏం చేయాలని అనుకుంటుందో తెలియడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దీక్షితులుపై టీటీడీ వేసిన పరువు నష్టం దావాను సైతం వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు.ఎన్నో ఆరోపణలు వచ్చిన ఆయన్ను, ఆగమ శాస్త్ర సలహాదారుడిగా నియమించడం ఏంటని ప్రశ్నించారు. జగన్ వైఖరిని చూస్తుంటే, త్వరలోనే ఆయన్ను ప్రధాన అర్చకుడిగా నియమించేలా ఉన్నారని నిప్పులు చెరిగారు.వెంకన్న వద్ద జగన్ నాటకాలు ఆడుతున్నారని, ఆయన ఆటలు ఇంకెంతోకాలం సాగబోవని అన్నారు.
సోనియా, కలామ్ వంటి అన్యమతస్థులు స్వామిపై విశ్వాసం ఉందని అఫిడవిట్ ఇచ్చి స్వామిని దర్శించుకున్నారని, తన మతం చెప్పుకుని అఫిడవిట్ ఇచ్చే ధైర్యం జగన్ కు లేకపోయిందని అన్నారు. ఇంట్లోని వారు చనిపోతే హిందువులు ఏడాది వరకు ఆలయాలకు వెళ్లబోరని, కానీ, జగన్ మాత్రం విశ్వాసాలను తుంగలో తొక్కి పట్టువస్ర్తాలు తీసుకుని తిరుమలకు వెళ్లారని దుయ్యబట్టారు.