ఏపీసీఎం చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒక్కొక్కరుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ప్రత్యక్షంగా చెప్పకపోయినా, అధికారికంగా ఆయా అభ్యర్థుల పేర్లను మంత్రి వర్గంలో ప్రకటిస్తుండటం విశేషం. తాజాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీటును ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ కు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జలీల్ ఖాన్ కు తెలియజేశారు. దీనితో ఆయన సంతోషంలో మునిగిపోయారు.
ఈ విషయమై జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ వెస్ట్ టికెట్ ను తన కుమార్తెకు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారని తెలిపారు. తొలిసారి ఓ మైనారిటీ మహిళకు చంద్రబాబు టికెట్ ఇచ్చారనీ, ఇందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు.
అలాగే, వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరబోతున్నారనీ, ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖరారయిందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికలలో మరోసారి టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ టికెట్ పై గెలుపొదిన జలీల్ ఖాన్, ఆ తర్వాత టీడీపీలో చేరారు.