ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరుతో పాటు స్పీకర్ వ్యవహారం పైనా విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవం పోయేలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ తమ సభ్యులకు పొరపాటున మైకు ఇచ్చినా, అధికార పార్టీ నుంచి సూచనలు వచ్చిన వెంటనే కట్ చేస్తారని విమర్శించారు.
తమకు మాట్లాడే అవకాశం లేకపోవడంతోనే ఇలా ప్రతిరోజూ మీడియా ముందుకు వస్తున్నామని, సభలో మాట్లాడాల్సిన అంశాలను ఇక్కడ వివరించాల్సి వస్తోందని అన్నారు. ఇంకా, రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయని, ఈ రెండు రోజులు సభలోనే అధికారపక్షాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత, అధికార పార్టీ ఏం చేస్తుందనే విషయాలను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామని స్పష్టం చేశారు.