telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాఫెల్‌ స్కాంతో మోదీ ఎలాంటి చౌకీదారో తెలుస్తోంది: చంద్రబాబు

CM Chandrababu fire to CEC

రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణంతో మోదీ ఎలాంటి చౌకీదారో స్పష్టంగా తెలుస్తోందంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురలో సోమవారం సాయంత్రం కాంగ్రె్‌స-జేడీఎస్‌ మిత్రపక్షాల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కన్నడ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం సభికుల కోరిక మేరకు తెలుగులో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఘోర పరాజయం దక్కనుందని జోస్యం చెప్పారు. గతంలో మతతత్వ బీజేపీని దూరంగా ఉంచడానికి దేవేగౌడను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టామని గుర్తు చేశారు. ఆయన దేశంలోని అన్నదాతల సంక్షేమానికి బలమైన పునాదులు వేశారన్నారు. ఎన్నో రైతాంగ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు.

కాంగ్రెసేతర, బీజేపీయేతర తొలి ప్రధానిగా దేవేగౌడ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఆయన అనుభవం, సమర్థ నాయకత్వం దేశానికి అవసరమని గుర్తించి తృతీయ కూటమి నేతగా నేనే ఆరోజు దేవేగౌడ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించానని తెలిపారు. ఆయన బాటలోనే ఆయన కుమారుడు ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రజలు మెచ్చేలా సుపరిపాలన సాగిస్తున్నారన్నారు. సినిమాల్లో విలువైన కెరీర్‌ను వదలుకుని తండ్రి మాట కోసం ప్రజా జీవితంలోకి వచ్చిన నిఖిల్‌ను ఆశీర్వదించాలని మండ్య ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Related posts