కేసీఆర్ బెదిరింపులకు తాను భయపడనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి వాళ్లను రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని చంద్రబాబు తెలిపారు. ఇచ్చాపురంలో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ని మనం అభివృద్ధి చేసిస్తే కేసీఆర్ అనుభవిస్తున్నారన్నారు.
ప్రతిపక్ష నేత జగన్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని బాబు వ్యాఖ్యానించారు. జగన్ శుక్రవారం కోర్టుకెళ్తాడు కానీ అసెంబ్లీకి మాత్రం రాడని విమర్శించారు. అసెంబ్లీకి 20 సార్లు వస్తే కోర్టుకి మాత్రం 240 సార్లు వెళ్లారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలతో పులివెందుల అట్టుడికిపోతోందన్నారు. పులివెందుల మార్క్ రాజకీయాలు కావాలా? అని అడిగారు. పులివెందులలో ఎవరికీ భద్రత లేదని విమర్శించారు. మీ ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కావాలంటే టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.