ప్రధాని పదవికి కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీ కంటే టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సరైన వ్యక్తి అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శరద్ పవార్ మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్షాల కూటమిలో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెసు చీఫ్ రాహుల్ గాంధీని శరద్ పవార్ వ్యతిరేకించారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు.
ప్రధాని అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం మాయావతిలో ముందువరుసలో ఉంటారని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అనే మాటలు నిరాధారమైనవని అన్నారు. ప్రధాని పదవిపై తనకు ఆసక్తి ఉన్నట్లు మాయావతి ఇప్పటికే వెల్లడించారు. మమత, చంద్రబాబు మాత్రం బేజీపీ ని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. తాను ప్రధాని పదవి రేసులో లేనని పవార్ చెప్పారు. ఎన్నికల తర్వాత కొన్ని ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలు కూడా తమ వైపు వస్తాయని పవార్ అన్నారు. దేశంలో మంచి నాయకుల కొరత ఏమీ లేదని, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తాము ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.