ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. దేవదాస్ కనకాల నటుడిగా రాణించడమే కాకుండా ఎంతోమందిని ఉత్తమ నటులుగా తీర్చిదిద్ది చిత్ర పరిశ్రమకు అందించారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన మరణం కళారంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
ఈ విషాద సమయంలో దేవదాస్ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు. దేవదాస్ కనకాల అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా దేవదాస్ కనకాల మృతిపై ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశారు.