ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు సూచించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గా మీకు అవకాశం వచ్చింది. రాష్ట్ర సమస్యలు కూడా ఆలోచించాలి. నేను చెప్పాలంటే నా రాజకీయ అనుభవం అంత సుమారుగా మీ వయసు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలతో సీఎం జగన్ సహా పలువురు సభ్యులు చిరునవ్వు నవ్వారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడే సీఎం జగన్ ప్రస్తావిస్తారని తాను అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్ హిట్లర్. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపీ, తెలంగాణ ఇండియా-పాకిస్థాన్ అయిపోతాయని సీఎం గారు గతంలో అన్నారు. ఇప్పుడు ఆయన మాట మార్చుకున్నారు. భావితరాల భవిష్యత్తును తాకట్టు పెట్టే అధికారం మీకు లేదు అని హెచ్చరిస్తున్నా అని చెప్పారు.అన్నీ నాకు తెలుసు అని విర్రవీగడం కరెక్టు కాదని చంద్రబాబు తెలిపారు. ఇంతలో అధికార పక్ష సభ్యులు గోలగోల చేయడంతో చంద్రబాబు సహనం కోల్పోయారు. ఏం ఎగతాళి చేస్తున్నారా మీరు? అవమానించేదానికి సిద్ధపడతారా? మీరు ఏదో గట్టిగా మాట్లాడితే మేం భయపడమని సభలో తేల్చిచెప్పారు.