కేంద్రం ప్రకటించిన విశాఖ జోన్ ఓ మాయా జోన్ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక మరో కుట్రలో భాగమని ఆయన అన్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు చేయాలని సీఎం పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున అన్నింటికీ సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 13 నియోజకవర్గాల సమీక్షలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. యుద్ధం గురించి రెండేళ్ల క్రితం చెప్పారని పవన్ వ్యాఖ్యలే బీజేపీ దుర్మార్గ రాజకీయాలకు రుజువని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.