ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసేందుకు మరోసారి వీరిద్దరు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ ఉదయం పార్టీ నేతలు కార్యకర్తలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్రలో భాగంగానే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముందు హడావుడిగా రైల్వే జోన్ ను ప్రకటించారని ఆరోపించారు.
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసిబూసిన మారేడుకాయ వంటిదని ఎద్దేవా చేశారు.రాష్ట్రానికి తక్కువ ఆదాయం వచ్చేందుకు కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. విభజన హామీల అమలుపై శుక్రవారం నాడు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. రైల్వే జోన్ ఇచ్చారని వైసీపీ సంబరాలు చేసుకుంటోందని దుయ్యబట్టారు. కేంద్రం చేసిన మోసాన్ని వైసీపీ కప్పిబుచ్చేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.