telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ను గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు మొక్కుతారు: చంద్రబాబు

Chandrababu Comments Jagan KCR

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆదివారం విశాఖ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్‌ను గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు మొక్కుతారని ఎద్దేవా చేశారు. తనకు పడిన ఓట్లను కేసీఆర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి కేసులను మాఫీ చేసుకొంటారని బాబు ఆరోపించారు. కేసీఆర్ కాళ్లు మొక్కే జగన్ కావాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నేను కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు.

ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. హైద్రాబాద్‌లో ఆంధ్రోళ్లు అంటూ అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉలవచారు అంటూ ఆత్మాభిమానం దెబ్బతినేలా హేళన చేస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రుల పౌరుషాన్ని, నవ్యాంధ్ర రోషాన్ని చూపించాలని బాబు కోరారు. పోలవరంపై ఎందుకు కేసులు వేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధి చెందకుండా తెలంగాణ అడ్డుకుంటోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబితే కేసీఆర్ అడ్డుపడుతున్నాడని బాబు విమర్శించారు.

Related posts