కేంద్ర బడ్జెట్పై టీడీపీ అధినేత చంద్రబాబు పెదవి విరిచారు. ఏపీ ప్రజలను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన అన్నారు. విశాఖ, విజయవాడ మెట్రోలు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టులకు బడ్జెట్లో కేటాయింపులు లేవని చంద్రబాబు ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలను విస్మరించారని అన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన తొలి ఏడాది ఆర్ధికలోటు భర్తీలో ఇంకా ఇవ్వాల్సిన దానిపై ఏదీ తేల్చలేదన్నారు.
ఆటో మొబైల్, వ్యవసాయం, సేవారంగాలకు ప్రాధాన్యం తగ్గించారని విమర్శించారు. అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి.. రూ.13 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ఐఐటీ, నిట్, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐజర్ లాంటి.. విద్యాసంస్థలకు ఒక్కపైసా కూడా కేటాయించలేదని చెప్పారు. రూ.16వేల కోట్ల లోటుకు గాను రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చారని మిగితా కెటాయింపులు బడ్జెట్ లో పేర్కొనక పోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.