ఏపీలో భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకు, ఇసుక కొరతను నిరసిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు. విజయవాడలోని ధర్నాచౌక్లో 12 గంటల నిరసన దీక్షకు దిగారు. రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. దీక్షా స్థలికి చేరుకున్న చంద్రబాబు.. బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూల మాలలు వేశారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు నివాళులర్పించారు.
భవన నిర్మాణ కార్మికులు నూలు దండవేసి చంద్రబాబును దీక్షాస్థలి వద్ద కూర్చోబెట్టారు. 12 గంటల నిరసన దీక్ష కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు ఈ దీక్షకు భాజపా, జనసేనతోపాటు వామపక్ష పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి.