వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం టీడీపీయేనని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్, షర్మిల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ఏపీ పోలీసులపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.
టీడీపీపై షర్మిల ఎందుకు ఆరోపణలు చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. నీతివంతమైన రాజకీయాలకే తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. షర్మిల వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగారో తెలియలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు ఏపీలో ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు.