పశ్చిమబెంగాల్ సీఎం మమత ఎపిసోడ్ విషయంలో కేసీఆర్, జగన్ మౌనంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేశారు. మిషన్ ఎలక్షన్-2019లో భాగంగా టీడీపీ నేతలతో ఈరోజు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకున్న దారుణ పరిణామాలను అందరూ ఖండిచారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ఖండించలేదని చంద్రబాబు విమర్శించారు. వీరిద్దరూ ప్రధాని మోదీ కనుసన్నల్లో ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందని చెప్పారు.
అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని, బడ్జెట్ పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోందని చెప్పారు. ఎన్ని ఆర్ధిక కష్టాలున్నా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సమాజంలో ఎవరినీ నిరాదరణకు గురికానివ్వమని సీఎం హామీ ఇచ్చారు. అలాగే విపక్షాలకు మమతా బెనర్జీ మూలస్తంభం లాంటివారని చంద్రబాబు కొనియాడారు. పేదరిక నిర్మూలనే తమ కులమని, పేదరికంలో ఉన్నవారికి తోడ్పాటు అందించే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాల ప్రజలను పైకి తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.