ఓ భూ వివాదంలో రూ. 1.12 కోట్ల లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నిన్న ఆయనను హైద్రాబాద్ చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో సహ నిందితులైన నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్చేడ్ తహసీల్దారు అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, బినామీ జీవన్గౌడ్లను కూడా రిమాండ్కు తరలించారు.
వారికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. లంచం డబ్బుల కోసం నగేశ్ పలు విడతలుగా బాధితుడు లింగమూర్తితో మాట్లాడిన ఆడియో క్లిప్పింగుల్లో మరికొన్ని విషయాలు గురువారం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.