ఇటీవల కేరళలో వరదలు బీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు సహాయక చర్యల కోసం వాడిన హెలీకాఫ్టర్లకు బిల్లు పంపించింది కేంద్రం.. అది కేరళ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలంటూ.. కేరళ వరదల సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను వాడుకున్నందుకు గాను రూ.102 కోట్ల రూపాయల బిల్లును ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పంపించింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రీ రాజ్యసభకు వెల్లడించారు.
కేరళలో వరదల సమయంలో సహాయ పనుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను వినియోగించారు. ఈ హెలికాప్టర్ల ద్వార 3,787 మందిని కాపాడామని, 1,350 టన్నుల ఆహార పదార్థాలను వరద ప్రాంతాలకు చేరవేశామని మంత్రి పేర్కొన్నారు. వరద సహాయ పనుల బిల్లులు చెల్లించాలని తాము కోరామని మంత్రి వివరించారు. కాగా వరద సహాయపనులు చేపట్టినందుకు కూడా బిల్లులు పంపించడంపై ఆ రాష్ట్రంలో కేంద్రంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.