కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నమాట ఈ దొంగలకు ఇలా అర్ధం అయినట్టుగా ఉంది. ఏదో సాంప్రదాయంగా ఒకటో రెండో సెల్ ఫోన్ లు దొంగతనం చేస్తాడు ఏ దొంగైనా కానీ వీళ్ళు ఏకంగా లారీడు కొట్టుకెళ్ళిపోయారు. మరి జనాలకి ఇంత మొబైల్ పిచ్చి పట్టిందనుకోలేదు.. నిజంగా ఎంత పిచ్చి ఉండకపోతే లారీడు కొట్టేస్తారు. ఇదేనేమో పిచ్చి పీక్స్ అంటే. ఈ ఘటన గురించి వివరాలు.. నెల్లూరు జిల్లాలో సెల్ఫోన్ల లారీని దుండగులు అపహరించారు. తడ మండలం సమీపంలో ఉన్న శ్రీసిటీ నుంచి సెల్ఫోన్ల లోడుతో కోల్కతా వెళ్తున్న లారీని మార్గమధ్యంలో దగదర్తి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు.
సెల్ఫోన్ల లోడుతో వెళ్తున్న లారీని ఆపి డ్రైవర్ను సమీపంలో ఉన్న చెట్టుకు కట్టేసి దుండగులు సెల్ఫోన్లను మరో లారీకి తరలించుకుపోయారు. ఖాళీ లారీని కావలి మండలంలోని గౌరవరం జాతీయ రహదారిపై దుండగులు వదిలి పెట్టారు. చెట్టుకట్టేసిన డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు దగదర్తి ఎస్సై అంకమ్మ తెలిపారు.