నేడు విడుదలైన సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన హన్సికా శుక్లా 499/500 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఒత్తిడి పెంచుకోకుండా ఇష్టపడి చదివానని చెప్పింది. ఈ ఫలితాల్లో తానే టాప్ అని నమ్మలేకపోయానని మీడియాతో చెప్పింది. ఈరోజు వెల్లడించిన ఫలితాల్లో నేను టాప్ ర్యాంకర్ని అంటే నమ్మలేకపోతున్నాను. మా నాన్న ఆఫీసు నుంచి నాకు ఫోన్ చేశారు. నేను తీయలేదు. ఆయన రాజ్యసభలో సెక్రటరీగా పనిచేస్తున్నారు. అమ్మ ఘజియాబాద్ లోని ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె ఇంటికి వచ్చి నాకు ఈ విషయం చెప్పారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేనెప్పుడూ కూల్గా ఉంటాను. అదే నేను ఒత్తిడికి గురవ్వకుండా కాపాడుతుంది.
పరీక్షలు కొద్ది రోజుల్లో ప్రారంభవుతాయనగా సామాజిక మాధ్యమాలను పూర్తిగా పక్కన పెట్టేశాను. అవసరం అయితే తప్ప ఫోన్ తాకింది లేదు. పూర్తిగా చదువు మీదే దృష్టి పెట్టాను. ప్రతి సబ్జెక్టును విశ్లేషించుకుని చదువుకున్నాను. ట్యూషన్కు కూడా వెళ్లలేదు. ఈ విజయంలో మా అమ్మానాన్న పాత్ర ఎంతో కీలకం. నా స్నేహితులు సైతం నన్ను ఎంతో ప్రోత్సహించారు. బ్యాచిలర్ సైకాలజీ చేసి ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరడమే నా లక్ష్యం. సైకాలజీ అంటే నాకెంతో ఇష్టం. దీంతోపాటు విదేశీ వ్యవహారాలన్నా ఆసక్తే. అందుకే సైకాలజీని ఎంపిక చేసుకున్నాను’ అని తెలిపింది.
ఈ ఫలితాల్లో హన్సికకు హిస్టరీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, హిందుస్థానీ గాత్రంలో నూటికి నూరు మార్కులు వచ్చాయి. ఒక్క ఇంగ్లీషులో మాత్రం 99 మార్కులొచ్చాయి.