రానురాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తన విలువలు మరిచి తెలంగాణ వాసులను విమర్శించడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తే ఏపీలో తనకు ఉనికి ఉంటుందని ఎవరైనా చెపితే చేస్తున్నాడో.. తనకే అలా అనాలి అనిపించి అంటున్నాడో తెలియటంలేదు కానీ.. మొత్తానికి ఇటీవల భారీగానే విమర్శలు చేస్తున్నాడు. తాజాగా తెలంగాణను భారతదేశ బద్ద శత్రువు అయిన పాక్ తో కూడా పోల్చినందుకు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
అంతటితో ఆగకుండా, పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. రాష్ట్ర అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం భీమవరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం పాక్ లా మారిందని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ది కోసం ఆయన తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నోరు పారేసుకుంటున్నారని అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు చేసింది.