తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 313 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇద్దరు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 142 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. ఇది ఇలా ఉండగా… తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో మొత్తం 105 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా అందులో 22 మంది విద్యార్థులతో పాటు వార్డెన్కు, వాచ్మెన్కు కరోనా పాజిటివ్గా తేలింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ నిర్ధారణ అయిన విద్యార్థులను పాఠశాలలోని రెండో అంతస్తులో ఐసోలేషన్లో ఉంచారు. మిగిలిన విద్యార్థులను ఇంటికి పంపించారు. అటు..శంషాబాద్ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. చిన్న గోల్కొండ, పెద్ద గొల్కొండ గ్రామాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు ఇద్దరికి కొవిడ్ నిర్ధారణ అయింది.