గతవారం నుండి భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దులలో యుద్దవాతావరణం నెలకొంది. దీనితో ఆయా దేశాలు భారత్ కు వారివారి విమాన సేవలను రద్దు చేసుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితిని బట్టి పాక్ ఎప్పుడైనా యుద్ధ సన్నాహాలు ప్రారంభించే అవకాశాలు ఉండటంతో భారత్ కూడా సన్నధం అవుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఇతర దేశస్తులు భారత్ కు రావడం క్షేమం కాదని తలచి, ఆయా దేశాలు విమానసేవలు రద్దు చేసుకుంటున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా, పాక్ యుద్ధ సన్నాహాల్లో మునిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని విమానాశ్రయాలను మూసివేసిన పాక్.. తమ గగనతలాన్ని కూడా మూసివేసింది.
ఇప్పటికే చాలా వరకు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా టొరొంటో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం మార్గమధ్యంలోనే తిరిగి కెనడాకు మళ్లింది. వాంకోవర్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఇది తాత్కాలిక నిర్ణయం మాత్రమేనని, పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఎయిర్ కెనడా స్పష్టం చేసింది.