ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ‘బైజుస్’ ఆన్లైన్ బోధనలో ఎంతో ప్రాచుర్యంపొందింది. పిల్లలకు ఆల్లైన్లో పాఠ్యాంశాలు అర్ధమయ్యే చెప్పే విధానంలో విజయం సాధించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు కూడా త్వరలో ‘బైజుస్’ తరగతులు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసే క్రమంలో నీతి ఆయోగ్ ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ విధానంలో పిల్లలకు ఉచితంగా విద్యాంశాలు అందుబాటులో ఉంచేందుకు బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని 2,578 పాఠశాలల్లో, 1,26,714 మంది విద్యార్థులకు ఈ తరగతులు కొనసాగనున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన డిజిటల్ పాఠ్యాంశాలను బైజూస్ సంస్థ ఉచితంగా అందజేయనున్నది.
దేశవ్యాప్తంగా 112 ఆస్పిరేషనల్ జిల్లాల్లో ఈ తరగతులను నిర్వహించనుండగా.. తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలు ఎంపికయ్యాయి. 6 -12 తరగతులకువారికి ఉచిత విద్యనందించడంతోపాటు, బైజూస్ కెరీర్ ప్లస్ ప్రోగ్రాం ద్వారా నీట్, జేఈఈకి హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణనివ్వనున్నారు. మూడేళ్ళ పాటు ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది.
కాగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఇంగ్లిషు మీడియం పాఠశాలలు ప్రారంభించినా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చదివిస్తున్నారని పీఆర్సీ నివేదిక ప్రస్తావించింది. ఉద్యోగులు వీటిని వినియోగించుకోకపోవడంతో ప్రభుత్వ విద్యపై ఇతరుల్లోనూ సదభిప్రాయం ఉండటం లేదని పేర్కొంది. దీంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం సర్కార్ ‘బైజుస్’ సంస్థతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తొంది.