చెన్నైలోని కోతారి రోడ్ ప్రాంతంలో ఓ వ్యాపారస్తురాలు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక అనుమానం వ్యక్తం చేశారు. లాన్సన్ టయోటా జాయింట్ ఛైర్పర్సన్ రీటా లంకలింగం(49) గురువారం ఉదయం 9 గంటల తర్వాత కూడా ఇంట్లోంచి బయటకు రాలేదు. తర్వాత ఆమెతో కలిసి పనిచేసే ఓ సూపర్వైజర్ గదిలో ఉరివేసుకున్న రీటాను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఓ ఉద్యోగిపై చర్యలు తీసుకున్న విషయంలో తన భర్త, లాన్సన్ టయోటా మేనేజింగ్ డైరెక్టర్ లంకలింగం మురిగేశ్తో గడిచిన రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ వివాదంలోనే ఆమె అతిగా ఆవేశపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లో లేరని, అతడు ఓ హోటల్లో ఉన్నట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కిల్పాక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.