telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బద్దలేసిపోతున్న .. బస్సు చార్జీలు.. చూసీచూడనట్టే ఉంటున్న అధికారులు.. కమిషన్ కోసమేమో..

bus charges hiked drastically no action from govt

సంక్రాంతికి సొంత ఊళ్లకు చేరుకోడానికి నగరవాసులు శుక్రవారం రాత్రి నుంచే బారులు తీరడంతో ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడాయి. శనివారం నుంచి ఇంటర్‌ కాలేజీలకు సెలవు ఇవ్వడంతో బస్టాండ్‌లన్నీ విద్యార్థులతో కిక్కిరిశాయి. విజయవాడ, బెంగళూర్‌, వరంగల్‌, కరీంనగర్‌ వైపు వెళ్లే జాతీయ, ప్రధాన రహదారుల్లో బస్సులు బారులు తీరాయి. పల్లె వెలుగు బస్సు నుంచి లగ్జరీ గరుడ బస్సుల వరకు ప్రతీ బస్సు బస్టాండ్‌ నుంచి రద్దీగా కదిలాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 3,414 బస్సులు, ఏపీ నుంచి 1,526 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించిన విషయం విధితమే. రద్దీకి అనుగుణంగా అధికారులు అదనంగా 757బస్సులను నడిపారు. ఐటీ ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమ, మంగళవారాలు అదనంగా రెండు సెలవులు పెట్టి పండగ కోసం సొంత ఊర్లకు బయలుదేరారు.

నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారితోపాటు ఉపాధి కోసం వచ్చినవారంతా ఐటీ ఉద్యోగుల తరహాలోనే సెలవులు పెట్టి పండగకు ఊరెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ నుంచి ప్రతీ రోజు నడిచే షెడ్యూల్‌ బస్సులు 3,500తో పాటు అదనంగా 1,360బస్సులను అర్ధరాత్రి వరకు నడిపేందుకు ప్లాన్‌ చేశారు. అందులో దాదాపుగా 90శాతం అదనపు బస్సులు బయలుదేరాయని, అర్ధరాత్రి వరకు ప్లాన్‌ చేసిన బస్సులను అదనంగా నడిపేందుకు కసరత్తు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 11వ తేదీ నుంచి 14 వరకు 4,940 ప్రత్యేక బస్సులు 90శాతానికి పైైగా రిజర్వేషన్‌ అయినట్లు తెలిసింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, రాజోలు, నర్సాపురం తదితర ప్రాంతాల బస్సులన్నీ రిజర్వు చేసుకున్నట్లు తెలిసింది. ఆర్టీసీ ప్రస్తుతం సాధారణ రోజుల్లోలాగే వసూలు చేస్తోంది. హైదరాబాద్‌-విశాఖపట్నంకు ప్రస్తుతం ఆర్టీసీ కేవలం రూ.1056 మాత్రమే వసూలు చేస్తుండగా ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం రూ.2500 నుంచి రూ.3వేలకు పైగా వసూలు చేస్తున్నారు.

కూకట్‌పల్లిలో నిజాంపేట్‌రోడ్డు, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి బస్టాపుల్లో జనం రద్దీ నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల కోసం జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా ప్రయాణికులు నిల్చోని బస్సుల రాకకోసం వేచిచూడటం కన్పించింది. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు కూడా కూకట్‌పల్లి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌వైపు వెళ్లే ప్రయాణికులతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మియాపూర్‌ బీహెచ్‌ఈఎల్‌, లింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, కేపీహెచ్‌బీ ప్రాంతం నుంచి రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ సర్వీసులను ఏర్పాటు చేశాయి. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులతో ఎల్‌బీనగర్‌ నుంచి పనామా వరకు రోడ్డు వెంట జనాలు బారులు తీరారు. టీఎస్‌ ఆర్టీసీ, ఏపీఆర్టీసీలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాయి. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు బస్సుల రద్దీతో ప్లైఓవర్‌పై వాహనాలు బారులు తీరాయి. బెంగళూర్‌ జాతీయ రహదారిపై నుంచి వెళ్లే బస్సులు మెహిదీపట్నం, ఆరంఘర్‌, గచ్చిబౌలి వద్ద పెద్దఎత్తున చేరడంతో ఆయా ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఈ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల కంటే పెద్దఎత్తున ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు బారులు తీరాయి.

Related posts