ఈ ఎన్నికల్లో మోదీ నాటకాలు చెల్లవు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయమనిఅన్నారు. మెయిన్పూరిలో ములాయం సింగ్ యాదవ్ తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాయావతి పాల్గొని ప్రసంగించారు. వెనుకబడిన వర్గాల కోసం మోదీ చేసిందేమీ లేదన్నారు. దేశ భవిష్యత్ కోసమే మళ్లీ ఎస్పీ , బీఎస్పీ చేతులు కలిపాయని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ కోసం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
మెయిన్పూరిలో ములాయం సింగ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఆలోచిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని హామీ ఇస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల పేదలకు న్యాయం జరగదన్నారు. . తాము అధికారంలోకి వస్తే పేదలకు, వెనుకవడిన వర్గాలకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు.