దేశంలో పేదరికం పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పాలకులే కారణమని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. తన 63వ జన్మదిన వేడుకలను మంగళవారం లక్నోలో మాయావతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. రానున్న లోక్సభ ఎన్నిలల్లో బీజేపీని ఓడించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమనీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీ ప్రజలు బీజేపీకి పెద్ద గుణపాఠమే చెప్తారని మాయావతి పేర్కొన్నారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్పై జరిపిన సీబీఐ దాడులను రాజకీయ కక్ష్యసారింపు చర్యగా ఆమె వర్ణించారు.
సంక్షేమ పథకాలను అమలు చేయ్యలేని మోదీ బహిరంగ సభలు నిర్వహించి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి దేశంలో మతం, కులం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇటీవలే ముగిసిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ, ఈ ఎన్నికలు బీజేపీతో పాటు కాంగ్రెస్ అండ్ కంపెనీకి ఒక గుణపాఠమని అన్నారు. మూడు రాష్ట్రాలలోనూ రైతులకు అమలు చేసిన రుణమాఫీ ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పాలనతో దేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు.