ప్రైవేట్ టెలికం సంస్థలతో పోటీపడుతూ, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందిస్తున్నామని ఆ సంస్థ ఖమ్మం జిల్లా పీజీఎం పి. పద్మనాభం తెలిపారు. వైరాలోని బీఎస్ఎన్ఎల్ 3జీ టవర్స్ను 4జీ టెక్నాలజీకి మార్చే కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటిసారి వైరాలో బీఎస్ఎన్ఎల్ 3జీ టవర్స్ను 4జీ టెక్నాలజీకి మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని, పది రోజుల్లో వైరాలో 4జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీనివల్ల బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరింత వేగవంతమైన డేటా డౌన్లోడ్ అవుతుందని, వేగం పెరుగుతుందని వివరించారు.
జిల్లాలో మొత్తం 53 4జీ టవర్లు ప్రారంభిస్తామని వివరించారు. ఖమ్మంలో 30, కొత్తగూడెంలో 15, భద్రాచలంలో ఐదు, వైరాలో మూడు 3జీ టవర్లను 4జీ టవర్లుగా మార్చి ప్రారంభిస్తామని వివరించారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులు ఉచితంగా 4జీ సిమ్లను బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ నుంచి లేక వైరాలో రఘువీర్ ప్రాంచైజీ వద్ద పొందవచ్చుని తెలిపారు. ఇందుకోసం ఫొటో, అడ్రస్ ప్రూఫ్, గుర్తింపు ఆధారాలు ఇవ్వాలని సూచించారు. అత్యుత్తమమైన ప్లాన్స్ స్వల్పధరలకే అందిస్తున్నామని తెలిపారు. వార్షిక ఫ్లాన్స్ రూ.1699, వార్షిక ప్లస్ రూ.2099, ఆన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.100 ఎస్ఎంఎస్, రోజు 4జీ డేటా పొందవచ్చుని తెలిపారు.
కార్యక్రమంలో డీఈలు నర్సింహారావు, శ్రీనివాసరావు, ఎస్డీఈలు గోవిందు, వెంకటేశ్వరరావు, జేటీవో ప్రసాద్, ఓఎస్ గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.