రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఆందోళనగా ఉందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రం మూకదాడులకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు కేంద్రం, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న మూకదాడులపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. మూకదాడులు జరిగిన సమయాల్లో ప్రభుత్వం బాధితుల తరపున కాకుండా నేరస్తులకు అండగా ఉంటోందని విమర్శిం చారు. దేశంలోనే ఇటువంటి దాడులకు జార్ఖండ్ కేంద్రంగా ఉందని అన్నారు.
ఏ హిందువు కూడా జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సి) నుంచి తొలగింపబడరని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ మత ప్రాదిపదికన దేశాన్ని విభజించడమే బిజెపి-ఆర్ఎస్ఎస్ల లక్ష్యమని విమర్శించారు. అమెరికాలో భారత ప్రధాని పాల్గొన్న ‘హౌడీ మోడీ’ కార్యక్రమంపై మాట్లాడుతూ’ ఈ కార్యక్రమం వలన దేశానికి ఏం వస్తుంది.? ఇంతకు ముందు తొలగించిన వాణిజ్య ప్రత్యేక హోదా (జిఎస్పి)ని ఏమైనా తిరిగి తీసుకువస్తారా’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమెరికా కేంద్రంగా భారత్ తన విదేశాంగ విధానాన్ని రూపొందిస్తే అది ఖచ్చితంగా దేశానికి నష్టం చేకూరుస్తుందని అన్నారు.