పెళ్లంటేనే అటుఇటు బోలెడు లెక్కలు ఉంటాయి. ఇక కట్నకానుకలు విషయానికి వస్తే, పైసా తగ్గినా ఎంత రాద్ధాంతం అవుతుందో చెప్పనలవి కానిది. అదే కాస్త మార్పుతో జరిగింది. ఎప్పుడు పెళ్ళిపిల్ల ఇంటివారితో గొడవలు వస్తుండటం సహజం, అది కట్నకానుకలు విషయంలో, ఈసారి పెళ్ళిపిలగాడి ఇంట్లో అటువంటి ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన అరియలూర్ జిల్లాల్లో జరిగింది. జయంకొండాం సమీపం ఆదిత్యనాల్లూర్ గ్రామానికి చెందిన షణ్ముగం (48) కుమారుడు ఇళ మది(23). స్థానికంగా చిల్లర దుకాణం నడపడంతో పాటు, వ్యవసాయ పనులు చేసుకుని జీవించేవారు. రెండు రోజుల క్రితం ఇళమదికి వివాహమైంది. శనివారం రాత్రి తొలిరాత్రి ఏర్పాట్లు చేపట్టారు. అదే సమయంలో పెళ్లి ఖర్చులు, చదివింపుల వివరాలను లెక్క లేశారు.
ఈ క్రమంలో వరుడికిచ్చిన చదివింపుల నగదును తీసుకు రావాలని తండ్రి కోరాడు. కుమారుడు నిరాకరించాడు. వధువు గదిలో వేచివుంది. విషయం తెలుసుకున్న ఇళమది లెక్కలు మరుసటి రోజు చూసుకోవచ్చని తండ్రితో చెప్పాడు. ఇరువరి మధ్య వాగ్వాదం జరిగింది. తన తొలిరాత్రిని అడ్డుకునేలా వ్యవహరించిన తండ్రిపై ఆగ్రహించిన కుమారుడు గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో కుమారుడిపై తండ్రి కర్రతో దాడి చేశాడు. ఆగ్రహించిన కుమారుడు సైతం కర్రతో తండ్రిని తీవ్రంగా కొట్టడంతో ఆయన గాయపడ్డాడు. బంధువులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు నవవరుడ్ని అరెస్టుచేశారు.