బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ మెస్సియాస్ బొల్సొనరో భారత్లో నాలుగు రోజులపాటు పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు కావడంతో పాటు, భారత్తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాలను కూడా అన్వేషించనున్నారు. భారత్-బ్రెజిల్ దేశాల ఆర్థిక వ్యవస్ధలు మందగించిన నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. బొల్సొనరో బ్రెజిల్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత్ పర్యటించడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు ఏడుగురు మంత్రులు, వాణిజ్య ప్రతినిధి బృందం, ఉన్నతాధికారులు భారత్లో పర్యటిస్తారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ప్రధాని మోడీ ఆహ్వానంపై ఈ నెల 24 నుండి 27వ తేదీ వరకు బల్సనరో భారత్లో పర్యటిస్తారని, 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల పేరెడ్కు ముఖ్య అతిధిగా హాజరవుతారని పేర్కొంది. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ శనివారం బొల్సొనరోతో భేటీ అవుతారు. ఆయనకు ఆతిధ్యం కూడా ఇస్తారు. ఈ క్రమంలోనే ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ కూడా బల్సనరోతో భేటీ కానున్నారు.