ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణి తన భర్త లోకేష్ తరపున మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన భర్తకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బ్రహ్మణి మాట్లాడుతూ ప్రజల కోసం లోకేశ్ ఎంతో కష్టపడుతున్నారని, ఆయనకు కుటుంబం కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో కేవలం రూ.200 వున్న పింఛన్ను ఈ అయిదేళ్ల కాలంలో 2 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి న వెంటనే ఆ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుతుందన్నారు.
అన్న దాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.15వేలు అందిస్తుందన్నారు. మహిళల కోసం పసుపు-కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం రెండు దఫాలుగా రూ.20 వేలు ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ప్రతినెలా భృతిని అందిస్తూ బాసటగా నిలుస్తోందన్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలో 24 వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మించారని చెప్పారు. రాజధాని ప్రాంతమైన మంగళగిరికి 42 కంపెనీలను తీసుకువచ్చి 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని బ్రహ్మణి అన్నారు.