ఆరుబయట ఆడుకొంటూ ప్రమాదవశాత్తూ ఉడుకుతున్న మాంసం పాత్రలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా మదాంగపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన గౌతమి, అర్జున్ దంపతులు, తమ ఐదేళ్ల కుమారుడు రోహన్ తో కలిసి కామారెడ్డి జిల్లా మదాంగపల్లిలో జరుగుతున్న బంధువుల దశదిన కర్మకు హాజరయ్యారు.
బయట ఆడుకుంటున్న బాలుడు, విందు నిమిత్తం ఆరు బయట కట్టెల పొయ్యిని అమర్చి మాంసం కూర వండుతున్న పెద్ద గుండిగలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. దీంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న బంధువులు హుటాహుటిన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.