ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అలజడి రేపిన విషయం తెలిసిందే. తాము వేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని, రాజధానిపై ప్రజాభిప్రాయం సేకరించి నివేదిక ఇస్తుందని చెప్పారు. అయితే, నిపుణుల కమిటీ ఏర్పాటును సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై నిన్న న్యాయస్థానం విచారణ చేపట్టింది.
రాజధాని విషయంలో చెలరేగుతోన్న వివాదంపై వివరణ ఇవ్వాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డితో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, రాజధాని కమిటీ కన్వీనర్ జీఎన్ రావు, కమిటీ సభ్యులు తదితర ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాజధాని ప్రణాళికల పునఃసమీక్ష కోసం ఏర్పాటు చేసిన కమిటీపై వైఖరి తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీనిపై వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. అనంతరం విచారణను 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.