రాజకీయ పార్టీలు సిద్ధాంతం ప్రకారం నడుచుకోవాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఎవరున్నప్పటికీ బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రార్థనా మందిరాలపై రాళ్లు వేసిన వారిని విడుదల చేయాలంటూ ఓ జాతీయపార్టీ ధర్నాలు చేస్తోందని అన్నారు.
మతానికి, దేవుడికి, రాజకీయాలకు ముడిపెట్టే ఇలాంటి చర్యలను, ఆలోచనా విధానాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఇదొక దుష్ట సంప్రదాయం అని అన్నారు. రాజకీయ పార్టీగా నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పారు. దాని ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని ఆయన తెలిపారు.
రాజకీయ పార్టీ అంటే ఇతరులపై బురద చల్లడానికి ఉద్దేశించింది కాదని హితవు పలికారు. ఓ విధానం ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా బొత్స టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఇలాంటి సిద్ధాంతాలు ఏవీ లేవని అన్నారు. అవసరమైతే కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు.