ప్రముఖ వస్త్ర, జ్యూయలరీ వ్యాపారి, వైఎస్సార్ సీపీ నాయకుడు బొమ్మన రాజ్కుమార్(62) మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 27 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం దోసకాయలపల్లిలో జరగనున్నాయి.
బొమ్మన మరణవార్త తెలియడంతో వెంటనే నగరంలో రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతికి సంతాపంగా పలు వ్యాపార సంస్థలు మూసివేశారు.
బొమ్మన రాజ్కుమార్ తన 20వ ఏటే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి రామచంద్రరావుకు చేదోడు వాదోడుగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారు కూడా వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. వస్త్ర వ్యాపార రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారు.