దేశంలో కరోనా బాధితుల సంఖ్య 200కు దగ్గరగా ఉండగా.. ఐదుగురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా భయంతో స్కూల్స్, థియేటర్స్, షూటింగ్స్, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. ఇప్పటికే షూటింగ్లు ఆగిపోయాయి. మరోవైపు సినీ సెలెబ్రిటీలు తమ అభిమానులకు కరోనా నుంచి ఎలా దూరంగా ఉండాలో సూచిస్తున్నారు. అందులో భాగంగానే సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇదిలా ఉండగా… ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్గా తేలింది. బాలీవుడ్లో ఎన్నో హిట్ పాటలు పాడిన ఈమె బేబి డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి పాటలతో మరింత ప్రాచూర్యం పొందింది. గత ఆదివారం కనికా బ్రిటన్ నుంచి దేశానికి తిరిగి వచ్చారు. అయితే ఈ విషయాన్ని ఆమె గోప్యంగా ఉంచారు. ఇక్కడకు వచ్చిన తరువాత ఓ స్టార్ హోటల్లో ఉంటూ ఇటీవల ఆమె ఓ విందుకు హాజరయ్యారు. ఆ విందులో దాదాపు 100 మంది పాల్గొన్నట్లు సమాచారం. దీంతో కనికా ఎక్కడెక్కడ తిరిగారు..? ఆమె పాల్గొన్న విందులో ఎవరెవరు పాల్గొన్నారు అనే వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.