ఇటీవల ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్, పుల్వామా ఉగ్రదాడిలో 49 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఈ సంఘటనపై దేశ ప్రజలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. దీంతో భారత్ లోని అన్ని రంగాల వారు ఇకనుంచి పాకిస్థాన్ కు ఎలాంటి పరిస్థితుల్లోనూ సహకరించకూడదని, దాడిపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. “ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్” ఇప్పటినుంచి హిందీ పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పాకిస్థానీ ఆర్టిస్టులను బ్యాన్ చేస్తున్నట్టుగా తీర్మానించింది. గతంలో కూడా పాకిస్థానీ కళాకారులపై బ్యాన్ విధించినప్పటికీ కొంతమంది మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం బ్యాన్ ను ఖచ్చితంగా పాటించాలని, మ్యూజిక్ కంపెనీలతో సహా బ్యాన్ ను ఎవరు అతిక్రమించినా వారిని కూడా బ్యాన్ చేస్తామని హెచ్చరించారు ఫిలిం బాడీ చీఫ్ అడ్వయిజర్ అశోక్ పండిట్.