telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చంద్రముఖి-2లో హీరోయిన్ గా కియారా అద్వానీ!

Kiara

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్న చంద్రముఖి-2లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చంద్రముఖికి దర్శకత్వం వహించిన పి.వాసు ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. చంద్రముఖి మూవీలో రజినీకాంత్ ప్రొఫెసర్ పాత్ర కాకుండా వేట్టయ్యన్ అనే రాజు పాత్ర పోషించాడు. అందులో రాజనర్తకి అయిన చంద్రముఖిని నిండు సభలో వేట్టయ్యన్ శిరచ్ఛేదం చేసే సన్నివేశం ఒకటుంది. ఆ వేట్టయ్యన్, చంద్రముఖిల మధ్య జరిగే కథ నేపథ్యంలో చంద్రముఖి-2 సినిమా తీస్తున్నారు. లారెన్స్ రాజు పాత్రలో నటించనున్నారు. మొదటి భాగంలో చంద్రముఖి గా నటించిన జ్యోతికను ఈ సినిమాలో నటింపజేయాలని నిర్మాతలు ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు. సీనియర్ నటి సిమ్రాన్ కోసం చూసినా ఆమె కూడా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని ఈ సినిమాలో నటింపజేసేందుకు సన్ పిక్చర్స్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కియారా అద్వానీ ఇటీవల లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా తీసిన కాంచన రీమేక్ ‘లక్ష్మీ బాంబ్ ‘లో హీరోయిన్ గా నటించింది. చంద్రముఖి-2లో హీరోయిన్ గా కియారా అద్వానీని ఒప్పించేందుకు లారెన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2005లో వచ్చిన చంద్రముఖి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా కొన్నేళ్లపాటు ప్లాపుల్లో ఉన్న రజనీకాంత్ కు ఈ సినిమా ఘన విజయం కట్టబెట్టింది. అప్పట్లో సౌత్ లో అన్ని రికార్డులను ఈ సినిమా చెరిపేసింది. చంద్రముఖి-2 లో కూడా రజినీకాంత్ ను నటింప చేయాలని ప్రయత్నించిన కుదరలేదు. రజినీకాంత్ ముందు ఒప్పుకున్న సినిమాలు ఉండడం, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఉండడంతో ఆయన అనుమతి మేరకు లారెన్స్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఇదివరకే పి.వాసు చంద్రముఖి సీక్వెల్ అంటూ విక్టరీ వెంకటేష్ తో ‘నాగవల్లి ‘ చేయగా అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు చంద్రముఖి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో కథ సిద్ధం చేయడం, హర్రర్ సినిమాలతో విజయాలు కొట్టే హీరో లారెన్స్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Related posts